సునంద మృతి కేసు.. శశిథరూర్ కు హైకోర్టు నోటీసులు

  • శశిథరూర్ కు 2021లో క్లీన్ చిట్ ఇచ్చిన పటియాలా హౌస్ కోర్టు
  • కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన పోలీసులు
  • పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
భార్య సునందా పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే 2014 జనవరి 17న ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హత్య అనే కోణంలో తొలుత దర్యాప్తు జరిగింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారనే అభియోగాలు ఉన్నాయి. 

ఈ క్రమంలో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు... 2021 ఆగస్టులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసి, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు థరూర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2023 ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.

Shashi Tharoor
Sunanda Pushkar
Death Case
Delhi High Court

More Telugu News